అధికారుల అంచనాలకు మించి వడ్లు
ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థల కొరత
నారాయణపేట టౌన్, జూన్ 13 : జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనాలకు మించి ధాన్యం రావడంతో నిల్వ చేసేందుకు స్థల కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడినా ప్రతి రైతుతో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినా పంట దిగుబడులు ఎక్కువగా రావడం, లాక్డౌన్ కారణంగా రైతులు ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు ఆస్కారం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో ఆలస్యం కావడంతో పలు మండలాల్లో రైతులు రాస్తారోకో చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ మొత్తంలో ధాన్యం రావడంతో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కలెక్టర్ హరిచందన అధికారులతో సమీక్షించి ధాన్యం నిల్వ చేసేందుకు ఫంక్షన్హాళ్లు, ప్రైవేటు గోదాములు, పాఠశాలలు వినియోగించుకోవాలని సూచించడంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టారు.
అంచనాలకు మించి..
జిల్లాలో ఈసారి మొత్తం 109 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ద్వారా 41, పీఏసీసీఎస్ ద్వారా 54, మెప్మా ద్వారా 5, మార్కెట్ కమిటీ ద్వారా 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో యాసంగి సీజన్లో 45,802మంది రైతులు 96,801 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్షా30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులకు వివిధ అవసరాలకుపోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 96వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకొస్తారని అనుకున్నారు. అయితే పంట దిగుబడి ఎక్కువ రావడంతోపాటు ఇతర కారణాల వలన కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వచ్చింది. ఈ యాసంగిలో లక్షా60వేల మెట్రిక్ టన్నుల వరకు విక్రయాలు జరగవచ్చని అధికారులు తెలుపుతున్నారు.
కరోనాతో తిప్పలు..
యాసంగి పంట చేతికి వచ్చే సమయానికి కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని భావించి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే ప్రతిసారి రైతులు తమ పంట చేతికి వచ్చాక కొంత నిల్వ ఉంచుకోవడంతో పాటు బయటి మార్కెట్లో, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల రైతులు కొంతమంది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కు తరలించి విక్రయించేవారు. అయితే కరోనా విజృంభిస్తుండడంతో కర్ణాటక రాష్ట్రం లో లాక్డౌన్ విధించడం, ఇక్కడ కూడా బయటి మార్కెట్లో అమ్ముకోవడానికి ఆస్కారం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకొచ్చారు.
స్థలం లేక ఇబ్బందులు..
రైతులతో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ ఉంచేందుకు స్థలం లేకపోవడంతో ధాన్యం సేకరణ లో జాప్యం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా లో 5పెద్ద మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు లక్ష్యానికి మించి రెండింతల ధాన్యం తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. అంతేకాకుండా మిగిలిన 24 చిన్న మిల్లులకు కూడా ధా న్యం తరలించారు. మహబూబ్నగర్, గద్వాల, వనసర్తి జిల్లాలకు కూడా ధాన్యం పంపించారు. కలెక్టర్ హరిచందన సూచనల మేరకు జిల్లాలో అందుబాటులో ఉన్న రైతు వేదికలు, ఫం క్షన్ హాళ్లు, పాఠశాలల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారు. ఇంకా దాదాపు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
1,31,840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
జిల్లా వ్యాప్తంగా శనివారం వరకు 109 కొనుగోలు కేంద్రాల ద్వారా 20,158 మంది రైతులతో 1,31,840 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,00,911 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు, 23,919 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించగా, ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద 30,929 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. 8104 మంది రైతుల ఖాతాల్లో రూ.92.90 కోట్లు జమచేశారు.