లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ వ్యవహారం 22 ఏండ్ల బీసీ యువకుడి హత్యకు దారితీసింది. ప్రయాగరాజ్ జిల్లాలోని ఖులిబరి గ్రామంలో మంగళవారం అగ్ర కులానికి చెందిన వ్యక్తులు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో బాధిత యువకుడు మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోను యాదవ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో స్ధానిక ఠాకూర్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వీడియోను తొలగించాలని వారు సోను యాదవ్ను కోరగా అందుకు నిరాకరించాడు. దీంతో యాదవ్కు, నిందితుల మధ్య వాగ్వాదం తీవ్రస్ధాయికి చేరింది. నిందితులు కర్రలతో యాదవ్పై దాడి చేసి కొట్టడంతో అతడిని దవాఖానకు తరలించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోను యాదవ్ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.