హైదరాబాద్ : మహిళా టీచర్లను మార్ఫింగ్ ఫోటోలతో వేధించి, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును దోచుకున్నారనే ఆరోపణలపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వ్యక్తిని తమిళనాడులోని ఉరప్పక్కంకు చెందిన రేవతిపురం నివాసి పి. తమిళ సెల్వన్ (22)గా తెలిపారు. సైకియాట్రీలో ఎంఎస్సీ చదువుతున్నాడు.
గుర్తు తెలియని వ్యక్తులు తమ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అదేవిధంగా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన ఇద్దరు మహిళా ఫ్యాకల్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టెక్నాలజీ బాగా తెలిసిన సెల్వన్ అనే వ్యక్తి ర్యాండమ్గా మహిళల వివరాలను, వారి ఫోన్ నెంబర్లను, ఈ-మెయిల్ను బ్రౌజ్ చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళా టీచర్ల వివరాలను సేకరించాడు.
అనంతరం మార్ఫింగ్ యాప్ను ఉపయోగించి బాధితుల ఫోటోలను, వీడియోలను అసభ్యంగా చిత్రీకరించాడు. నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఈ మార్ఫడ్ చిత్రాలను టెలిగ్రామ్ ద్వారా బాధిత మహిళలకు పంపించి క్రిప్టోకరెన్సీలో డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వివిధ గ్రూప్ల్లో ఫోన్ నంబర్లను, ఫోటోలను షేర్ చేయనున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం జ్యూడిషియల్ కస్టడీ విధించింది.