వెంగళరావునగర్ : ప్రేమించిన యువకుడు మోసం చేశాడనే మనస్తాపంతో లేఖరాసి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం లోని రామ్నగర్కు చెందిన వాసర్ల అనూష (22) నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ మధురానగర్లోని జీ-బ్లాక్లో ఒంటరిగా నివాసం ఉంటుంది.
శనివారం అనూష విధులకు రాకపోవడంతో సహచరులు ఆమె ఫొన్ చేశారు. స్పందన లేకపోవడంతో సాయంత్రం ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూశారు. తలుపు తోపలి గడియపెట్టి ఉండటంతో పాటు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ అద్దాలను పగులగొట్టి చూశారు. లోపల అనూష సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.
దీంతో లోపలికి వెళ్లిన ఆమె సహచరులు వేలాడుతున్న అనూషను కిందకు దించి, హుటాహుటిన గాంధీ దవాఖానాకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ విషయాన్ని ఆమె సహచరులు విశాఖపట్నంలో ఉంటున్న సోదరుడు అవినాష్కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
సోదరుడు అవినాష్ నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనూష తన చావుకు గల కారణాలను లేఖ రాసి పెట్టింది. అందులో నవీన్ అనే వ్యక్తిని ప్రేమించానని, ఆయన మోసం చేశాడని, అతని పై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.