అమరావతి : అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. చిత్తూర్ జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో ఈ ఘటన జరిగింది. ప్రేమించిన యువతి తండ్రే యువకుడిని నరికి చంపాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(22) అదే గ్రామానికి చెందిన శైలజ అనే యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బెంగళూరులో డ్రైవర్గా పనిచేస్తున్న ధనశేఖర్ ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు.
ధనశేఖర్ ఆచూకీ కోసం వెతికినా లభించకపోవడంతో కుటుంబీకులు గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సొంత పొలంలోనే ధనశేఖర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువతి తండ్రే నరికి చంపాడని ధనశేఖర్ కుటుంబీకులు స్థానికంగా ఆందోళనకు దిగారు. ప్రాథమికంగా యువకుడిది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం అన్నివివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.