జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ/షేక్పేట్/వెంగళరావు నగర్,/ బంజారాహిల్స్ మే19: ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని, అపరిష్కృతంగా ఉండే సమస్యలు కొత్త సమస్యలు తెచ్చి పెడతాయని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్తో కలిసి యూసుఫ్గూడ సర్కిల్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ, యూసుఫ్గూడ డివిజన్తో పాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ మారుతీనగర్, ఎంజీనగర్, సాయిబాబా ఆలయం, తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూసుఫ్గూడ సర్కిల్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మిదేవిని అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆ యా వార్డులను సమస్యల రహితంగా తీర్చిదిద్దాలని మే యర్ సూచించారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల పరిధిలోని వరదనీటి నాలాలు పరిశీలించారు. వెంగళ రావునగర్ డివిజన్లోని రహ్మత్నగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న నాలా, జానకమ్మ తోట, సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రహ్మత్నగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న నాలా, ఎల్లారెడ్డిగూడలోని వరద నీటి కాల్వల్లో పూడికతీత పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు జనకమ్మతోట వద్ద రోడ్లపై చెత్తకుప్పలు పడి ఉండటాన్ని గమనించి మేయర్ విజయలక్ష్మి అధికారుల్ని నిలదీ శారు. రానున్న వర్షాకాలంలో వరదనీటి సమస్యలు తలెత్తకుండా స్ట్రామ్ వాట ర్ డ్రైన్లు, నాలాలపై దృష్టి పెట్టాలన్నారు.
రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ, చెత్త సేకరణ, తరలింపు, డెబ్రిస్ డంపింగ్ వంటి సమస్యలపై అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. మారుతీనగర్, ఎంజీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన మేయర్.. డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటా మన్నారు.
ఈ పర్యటనలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, షాహీన్ బేగం, రషీద్ ఫర్హాజుద్దీన్, సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్) జోనల్ కమిషనర్ ప్రావీణ్య, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, 19 వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ.రమేశ్, జలమండలి డిప్యూటీ జీఎం చిట్టిబాబు, మేనేజర్ రమేశ్, ఈఈ రాజ్కుమార్తో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్, టీఆర్ఎస్ నేత, జాతీయ వినియోగదారుల హక్కుల పరి రక్షణ కమిషన్ వైస్ చైర్మన్ పీ.వీ.రవిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.