భోపాల్ : పెండ్లయిన రెండు రోజులకే కొత్త పెండ్లి కొడుకు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా గుర్జి గ్రామానికి చెందిన సోను పటేల్ కు మే 14న వివాహమైంది. మే 16న సెల్ ఫోన్ రిపేర్ కోసం బయటకు వెళ్లిన సోను ఇక తిరిగిరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతడికి సమీప గ్రామానికి చెందిన మధు పటేల్ తో సంబంధం ఉన్నట్టు వెల్లడైంది.
పోలీసులు మధు పటేల్ ను విచారించగా సోనును తానే చంపానని అంగీకరించింది. మే 16న సోనును రాళ్లు, కర్రలతో కొట్టి చంపి ఆపై మృతదేహాన్ని కజిన్ సాయంతో అడవిలో పడేశానని చెప్పింది. సోను రెండు నెలల కిందట తన అభ్యంతర వీడియోను తీసి కుటుంబ సభ్యులకు చూపాడని, దీంతో తనకు వేరొకరితో ఖాయమైన పెండ్లి రద్దయిందని ఆ కోపంతో అతడిని మట్టుపెట్టానని వెల్లడించింది. మధుపటేల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.