ఇబ్రహీంపట్నం, జులై 4: అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా ఏర్పడిన పట్నంను తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీగా రూపాంతరం చేసింది. అనంతరం భారీగా నిధులు కేటాయించడంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీ సత్వర అభివృద్ధికి పట్టణ ప్రగతి ఎంతగానో దోహదం చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రగతితో సత్ఫలితాలు
మూడో విడుత పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో మున్సిపాలిటీలోని 24వార్డులు అభివృద్ధిలో పరుగులు పెడుగుతున్నాయి. రెండు విడుతల్లో పట్టణ ప్రగతి కింద అనేక కార్యక్రమాలు చేపట్టడంతో మున్సిపాలిటీలోని ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, శేరిగూడ, సీతారాంపేట్ గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలోని పురాతన ఇండ్లను కూల్చివేయడంతో పాటు రోడ్లను వెడల్పు చేయడం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు రూ.15 లక్షలతో మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఉన్న పురాతన బావులు, ఇండ్లను కూల్చివేసారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ పెరగడంతో అభివృద్ధికి ప్రభుత్వపరంగా అధిక నిధులు వస్తున్నాయి.
పారిశుద్ధ్యంలో ఆదర్శంగా..
చెత్త రహిత మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఇప్పటికే గుర్తింపు పొందింది. మున్సిపాలిటీలో సుమారు 150 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లపై చెత్తాచెదారం తొలగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీనికోసం రూ.1.14 కోట్లతో నాలుగు ట్రాక్టర్లు, ఆరు ఆటో లు, ఒక జేసీబీ కొనుగోలు చేశారు. ఈ ఆటోలు, ట్రాక్టర్లు ప్రతిరోజూ ఉదయమే అన్ని వార్డులకు వెళ్లి ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలోని ప్రధాన రోడ్లన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.
రూ.47 లక్షలతో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించకుండా మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ.47 లక్షలతో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. మున్సిపాలిటీలోని సాగర్రోడ్డులోని విద్యుత్శాఖ కార్యాలయం, ప్రభుత్వ ఏరియా దవాఖాన, పోలీస్స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తాలో ఐదు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసేందుకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హరితహారంతో పచ్చబడ్డ సాగర్ రహదారి
రెండు విడుతల పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మున్సిపాలిటీలోని సాగర్ రహదారిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. సాగర్ రహదారికి ఇరువైపులా సుమారు ఏడు కిలోమీటర్లు రోడ్డుకిరువైపులా మొ క్కలు నాటారు. ఇవి ఏపుగా పెరిగి సాగర్ రహదారిని ప చ్చని చెట్లతో అలరిస్తున్నాయి. రహదారిలోని డివైడర్పైనా ప్రత్యేకంగా మూల మొక్కలు, ఇతరత్రా చెట్లు నాటడంతో అవి ఏపుగా పెరిగి చూపరులను ఆకర్షిస్తున్నాయి. పట్నం చెరువుకట్ట బైపాస్ రోడ్డులో నాటిన మొక్కలు కూడా ఏపుగా పెరిగి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నా యి. మూడో విడుత పట్టణ ప్రగతిలో మరిన్ని మొక్కలు నాటడం కోసం సుమారు రూ.20 లక్షలతో మున్సిపాలిటీ లో 9 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో సుమా రు 2.60 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రూ.8 లక్షలతో సాగర్ రహదారిపై మొక్కలు నాటి, సంరక్షించడంతో ఆశించిన మేరకు ఫలితాలిస్తున్నాయి.
రూ.కోటితో సీసీరోడ్ల నిర్మాణం
మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో ప్రజల అవసరాలను గుర్తించి సుమారు రూ.కోటితో సీసీరోడ్లు నిర్మించారు. దీం తో మున్సిపాలిటీలోని ఏ కాలనీలోకి వెళ్లినా సీసీరోడ్లే దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డులవారీగా సమావేశాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల అవసరాల మేరకు ఈ సీసీ రోడ్ల నిర్మించా రు. ఇందులో భాగంగానే భూగర్భ డ్రైనేజీ పనులు కూడా చేపట్టారు.
చురుకుగా అభివృద్ధి పనులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతితో పట్నంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రెండు విడుతల్లో పట్టణ ప్రగతి కింద చేపట్టిన అనేక కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. మూడో విడుతలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మొక్కలు పెంచడం, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రజల అవసరం మేరకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూడో విడుతలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి, వాటిని నాటి, సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం 2.60 లక్షల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాం.
– జయంత్కుమార్రెడ్డి,మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం