లక్నో : లిక్కర్ బాటిల్ ను పడవేసిందనే కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపిన ఘటన యూపీలోని ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ దులాహి గ్రామంలో బుధవారం రాత్రి గీతాదేవి, రమేష్ కుమార్ నిషద్ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాదులాట జరిగిన క్రమంలో గీతాదేవి పొరపాటున నిషద్ చేతిలో ఉన్న మద్యం బాటిల్ ను పడవేసింది. కొద్దిసేపటి తర్వాత మరోసారి ఇద్దరి మధ్య ఈ విషయమై ఘర్షణ జరిగింది.
కోపంతో ఊగిపోయిన నిషద్ కర్రతో భార్య గీతాదేవిని చితకబాదాడు. ఆమె అరుపులు విన్న స్ధానికులు అక్కడికి చేరుకునే లోపు ఆమె రక్తపు మడుగులో పడిఉంది. భర్త దాడితో గీతాదేవి ప్రాణాలు కోల్పోయింది. స్ధానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను చంపేందుకు నిందితుడు వాడిన పదునైన చెక్క కర్రను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.