లక్నో : అపరిచితుడితో మాట్లాడిందని మహిళను అత్తింటి వారు చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన యూపీలోని రాంపూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళ అత్తింటి వారు ఇద్దరినీ చెట్టుకు కట్టేసి తీవ్రంగా వేధించారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో నివసించే వ్యక్తికి రాంపూర్ జిల్లా అహ్మదాబాద్ గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. వారం కిందట తన పొలం పనుల నిమిత్తం ఆయన గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఎదురుపడిన మహిళతో మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు సహా స్ధానికులు వారిని చెట్టుకు కట్టేసి కొట్టారు. వ్యక్తి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎసక్పీ సంసార్ సింగ్ తెలిపారు.