డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనా విభాగ శాస్త్రం సమీక్ష సమావేశానికి హాజరైన విద్యార్థులు, అధ్యాపకుల వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలతో విద్యార్థులను సంసిద్ధులుగా తయారు చేయాలని సూచించారు. అధ్యాపకులు వారి వేతనాల పెంపు గురించి కోరగా.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సమీక్షలో విభాగాధిపతి డాక్టర్ పున్నయ్య, చైర్మన్ పాఠ్యప్రణాళిక సంఘ డాక్టర్ సంపత్, అధ్యాపకులు డాక్టర్ రామలింగం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం అర్థశాస్త్ర విభాగాన్ని రిజిస్ట్రార్ నసీంతో కలిసి సమీక్షించారు. అర్థ్ధశాస్త్ర విభాగ పరిశోధనలు సామాజిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వర్లు డిపార్ట్మెంట్ విద్యార్థులు, పరిశోధకుల వివరాలను నివేదించారు. పాఠ్యప్రణాళిక అధ్యక్షుడు పాత నాగరాజు దక్షిణ ప్రాంగణంలో అర్ధశాస్త్ర కోర్సును ప్రారంభించాలని సూచించగా ఉపకులపతి సానుకూలంగా స్పందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ ఎ.పున్నయ్య, డాక్టర్ సంపత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దత్తహరి పాల్గొన్నారు.
21న జాతీయ విద్యావిధానంపై వెబినార్ ..
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం-2020పై 21వ తేదీన నిర్వహించే ఒకరోజు వెబినార్ బ్రౌచర్ను వీసీ రవీందర్గుప్తా రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానంలో వస్తున్న సాంకేతిక మార్పులు, వాటి ప్రభావం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో, విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని కామర్స్ విభాగాధిపతి డాక్టర్ రాంబాబు గోపిశెట్టి అన్నారు. కార్యక్రమంలో డీన్ ఆచార్య యాదగిరి, వెబినార్ కన్వీనర్ డాక్టర్ కె.గంగాధర్, కో-కన్వీనర్ డాక్టర్ జి.శ్రీనివాస్, శ్వేత ఉన్నారు.
వీసీకి సన్మానం..
టీయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రవీందర్గుప్తాను వాణిజ్య విభాగం ఆచార్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాణిజ్య విభాగాధిపతి డాక్టర్ రాంబాబు గోపిశెట్టి ప్రొఫెసర్లను ఉపకులపతికి పరిచయం చేశారు. కామర్స్ విభాగం డీన్ ఆచార్య ఎం.యాదగిరి, జి.శ్రీనివాస్, శ్వేత, కె.గంగాధర్ తదితరులు ఉన్నారు.
దరఖాస్తులకు గడువు పొడిగింపు
మండలంలోని నూత్పల్లి మహాత్మా జ్యోతి బాఫూలే బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. ప్రభుత్వం ఈనెల 21వ తేదీ వరకు గడువు పొడిగిం చిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.