వరంగల్ లీగల్ : క్షణికావేశంతో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన భార్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఏడో అదనపు జిల్లా జడ్జి కే ప్రభాకర్ రావు తీర్పు ఇచ్చారు.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే నగరంలోని శంభునిపేట సమీపంలోని బుడగ జంగాల కాలనీలో యాక లక్ష్మీ తన భర్త చిల్ల రాజ్కుమార్తో కలిసి నివసిస్తుండేది. వీరిద్దరిది ప్రేమ వివాహం, వారికి ఇద్దరు పిల్లలు కూడా, అయితే రాజ్కుమార్ మద్యానికి బానిసై ఏ పని చేయకుండా నిత్యం భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అనేక పర్యాయాలు గొడవలు జరిగాయి. పెద్ద మనుషులు కూడా వీరిద్దరికి నచ్చచెప్పారు. అయినప్పటికీ తన తీరు మార్చుకోకుండా భార్యకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉండడంతో విసిగివేసారిన యాకలక్ష్మి తన భర్తను 2019, డిసెంబర్ 12వ తేదీన గొడ్డలితో నరికి హత్య చేసింది.
రాజ్కుమార్ తమ్ముడు రాజు ఫిర్యాదుతో అప్పటి మిల్స్ కాలనీ సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజే యాక లక్ష్మీని పోలీసులు అరెస్టు చేసి ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన అదనపు జిల్లా జడ్జి ప్రభాకర్ రావు.. యాక లక్ష్మి ఈ హత్యకు కారకురాలు అని నిర్ధారించారు, అయితే ఈ హత్య క్షణికావేశంతో చేసిన చర్యగా భావించి నిందితురాలికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ అబ్దుల్ నబీ వాదించారు. కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ దవుడు ప్రతాప్ ఈ కేసులో సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.