హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీ విటమిన్..సీ విటమిన్..డీ విటమిన్..బీ 12 విటమిన్..ఇలా కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల విటమిన్లను సమకూర్చుకోవాలంటే ఆయా పండ్లు తినాల్సిందే. ఈ విషయాలను వైద్యులే మనకు సూచిస్తున్నారు. జనం కూడా పాటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పండ్ల ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలతో పాటు ఆ పండ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు తినాలంటే మాత్రం కొంత ఆర్థిక భారం తప్పడం లేదు. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు వందలు పెడితే కానీ రెండు మూడు రకాల పండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఒక్కో కుటుంబం పండ్ల కోసమే వారానికి కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదు.
భారీ డిమాండ్.. పెరిగిన ధరలు
మామూలుగానే ఎండాకాలంలో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేని కారణంతో పండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం కరోనా పరిస్థితుల్లో ధరలు మరింత మండుతున్నాయి. మరీ ముఖ్యంగా ‘సీ’ విటమిన్ లభించే బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, ఆపిల్ తదితర పండ్ల ధరలు పెరిగాయి. రూ.100 పెడితే కానీ అరడజను నారింజ పండ్లు రావడం లేదు. రెండు నెలల క్రితం రూ.10కి ఒక నారింజ ఇచ్చేవారు. ఇప్పుడు అదే ధరకు అడుగుతుంటే వింతగా చూస్తున్నారు. రూ.50 పెడితే గానీ ఒక్క దానిమ్మ రావడం లేదు. ఒక్కో కివీ ఫ్రూట్ ధర రూ.30-40 మధ్య పలుకుతున్నది. బొప్పాయి కేజీ రూ.60-80 ఉంటున్నది. ఇక జామకాయలు కిలో రూ.60-70 వరకు చెప్తున్నారు. ద్రాక్ష కేజీ రూ.100-120 దాటిపోతున్నది. ఇక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న అల్లనేరేడు పండ్లు కేజీ రూ.150-200 పలుకుతుండడం గమనార్హం. నిన్నమొన్నటి వరకు భారీగా ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడిప్పుడే అగ్గువయ్యాయి. గతంలో కిలో రూ.100-120 పలికితే.. ఇప్పుడు రూ.60-80 మధ్య దొరుకుతున్నాయి. పుచ్చకాయ ధరలు మాత్రం కాస్త అందుబాటులో ఉండటం ఊరటనిచ్చే అంశం. అవి కేజీ రూ.20-30 పలుకుతున్నాయి.
వారంలో 1.50 లక్షల టన్నులు..
రాష్ట్రంలో పండ్లకు భారీ డిమాండ్ పెరిగింది. అదే స్థాయిలో దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్కు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి పండ్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా నారింజ, బత్తాయి, మామిడి, కివీ, ఆపిల్ పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అన్ని పండ్లు కలిపి గత వారం రోజుల్లో గడ్డిఅన్నారం మార్కెట్కు దాదాపు 1.50 లక్షల టన్నులు రావడం గమనార్హం. నారింజ, యాపిల్, కివీ ఫ్రూట్స్ వంటివాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి మన రాష్ర్టానికి వచ్చిన పండ్ల కొనుగోలుకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు కూడా పోటీ పడుతుండటం విశేషం.