జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక బాలికను దారుణంగా హతమార్చారు. గత ఏడాది డిసెంబర్ లో ఈ ఘటన జరగ్గా నిందితులిద్దరినీ అరెస్ట్ చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమిత్ అహిర్ భార్య టీనా తన కుమార్తె (4)తో కలిసి కనిపించడం లేదని నమోదైన మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టీనాకు ఫోన్ ద్వారా పరిచయమైన వ్యవసాయ కూలీ ప్రహ్లాద్ సహాయ్ తో కలిసి జైపూర్ రూరల్ పరిధిలోని ఉదవల గ్రామంలో ఉంటోంది. అయితే చిన్నారి ఆచూకీ గురించి పోలీసులు టీనాను ప్రశ్నించగా షాకింగ్ స్టోరీ బయటపెట్టింది. బాలిక గత ఏడాది డిసెంబర్ 8న ఆడుకుంటుండగా మెట్లపై నుంచి పడి తీవ్రంగా గాయపడింది. జైపూర్ నగరానికి తీసుకువెళ్లాలని స్థానిక వైద్యుడు వారికి సూచించగా..చికిత్స కోసం డబ్బు ఖర్చుచేసేందుకు ఇష్టపడని వారు బాలికను గొంతు నులిమి చంపి సమీప అటవీ ప్రాంతంలో పడేశారు. చిన్నారి హత్య కేసులో టీనాతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.