అహ్మదాబాద్ : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య ఉదంతం గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపి ఆపై అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. ఈ ఘటనలో నిందితులు దీప్తి పటేల్ (35) ఆమె ప్రియుడు సౌరభ్ సుతార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 20న దీప్తి పటేల్ 108కి కాల్ చేసి తన భర్త బిపిన్చంద్ర పటేల్కు తీవ్ర గుండెపోటు వచ్చిందని తెలిపింది.
ఆపై బిపిన్చంద్రను ఎల్జీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే బిపిన్చంద్రను హత్య చేశారని పోలీసులకు సమాచారం అందడంతో దీప్తి, సుతార్లను తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. తమ మధ్య వివాహేతర సంబంధం తెలుసుకున్న బిపిన్చంద్ర అడ్డుచెప్పడంతో అతడిని హత్య చేశామని వారు పోలీసులకు తెలిపారు. భర్తకు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చానని ఆపై ప్రియుడు సహకారంతో గొంతు పిసికి ఊపిరిఆడకుండా చేశానని దీప్తి పటేల్ తెలిపింది.