పహాడీషరీఫ్ :ఒంటరిగా ఉన్న మహిళ మెడకు తాడు బిగించి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల కాలనీలో నివాసముంటున్న కౌశిక్ శోభా శర్మ(76)కు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెండ్లిండ్లయ్యాయి. వారంతా హైదరాబాద్లో నివాసముంటున్నారు.
శోభ ఒక్కతే ఒంటరిగా గత కొన్ని సంవత్సరాల నుంచి రంగనాయకుల కాలనీకి దూరంగా ఉండే రంగనాయకుల దేవాలయం వద్ద ఉంటుంది. రంగనాయకులు స్వామిని ప్రార్థిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తుంది. మనోజ్ శర్మ అనే కుమారుడు తరుచుగా తల్లి వద్దకు వచ్చి ఆమెకు అవసరమైన వస్తువులను ఇస్తుంటాడు. ప్రతి రోజు తల్లితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఆగస్టు 28న సాయంత్రం 7.30కు ఫోన్ చేశాడు. సమాధానం రాకపోయే సరికి మామిడిపల్లి గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తిని తల్లి వద్దకు వెళ్లి చూడమన్నారు. అక్కడికి వెళ్లిన సురేశ్కు శోభ విగతజీవిగా కనిపించింది.
ఈ విషయాన్నిమనోజ్ శర్మకు చెప్పడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తల్లి మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు గమనించాడు. గదిలో ఉన్న బీరువా తాళం పగులకొట్టి ముఖ్యమైన వస్తువులను చోరీ చేశారు. మరుసటి రోజు 29న పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో మనోజ్ శర్మ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.