దొడ్డు వడ్లకు ఇది గడ్డు కాలం. ఇంతకాలం ఏ రకం పండించినా పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దొడ్డు రకం సాగు శ్రేయస్కరం కాదు. వాటిని భవిష్యత్లో అమ్ముకోవడమూ కష్టమే. ఇందుకు కారణం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా (ఎఫ్సీఐ) విధానాలే.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): దొడ్డు ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ నిరాకరిస్తున్నది. సన్నాలను మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నది. ఈ యాసంగిలో కూడా సన్నాలను మాత్రమే కొంటామని, దొడ్డు ధాన్యం కొనలేమని చెప్పింది. అదే జరిగితే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని దొడ్డు ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐని ఒప్పించారు. దీంతో 80% దొడ్డు ధాన్యం, 20% సన్న ధాన్యం కొనుగోలుకు అంగీకరించింది. మన రాష్ట్రంలో పండించే ధాన్యంలో అధిక శాతం ఎఫ్సీఐనే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ అది కొనకపోతే మన ధాన్యం ఇతరులకు విక్రయించడం కష్టం. ఈ యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో దొడ్డు ధాన్యం 1.17 కోట్ల టన్నులు, సన్నాల దిగుబడి 21 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ప్రతి సీజన్లోనూ మన రాష్ట్రంలో దొడ్డు రకమే ఎక్కువగా పండిస్తున్నారు. సన్నాల సాగు నామమాత్రమే.
ఆ రాష్ర్టాల్లోనూ పండుతున్నాయి
రాష్ట్రం నుంచి కొనుగోలు చేసిన దొడ్డు ధాన్యాన్ని ఎఫ్సీఐ తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్తోపాటు పలు రాష్ర్టాలకు సరఫరా చేస్తుంది. ఆయా రాష్ర్టాల్లోనూ వరి సాగు పెరిగింది. దీంతో మన రాష్ట్రం నుంచి సదరు రాష్ర్టాలకు బియ్యం పంపించే అవసరం ఎఫ్సీఐకి లేకుండా పోయింది. దీనితో ఎఫ్ఐసీ మన దొడ్డు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది. ఒకవేళ కొనుగోలు చేసినా వాటిని ఏం చేసుకోవాలన్నది ప్రశ్న. మరోవైపు వాటిని నిల్వ చేయడానికి గోదాంలు లేవు. ఇప్పటికే అవన్నీ నిండిపోయాయి.
సన్నాల సాగే శ్రేయస్కరం
గతంలో మన రాష్ట్రంతోపాటు పలు రాష్ర్టాల్లో దొడ్డు బియ్యం తినేవారు. ఇప్పుడు సన్నబియ్యం ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో సాగయ్యే సన్నాల్లో తెలంగాణ సోనా, జైశ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ, ఎంటీయూ రకాలకు ఇతర రాష్ర్టాల్లోనూ డిమాండ్ ఉన్నది. మన రాష్ట్రం నుంచి కర్ణాటక 10 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో సన్నాలు పండిస్తే రైతులకు మరింత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మద్దతుకు మించి ధర పలుకుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం కూడా గురుకులాలు, మధ్యాహ్న భోజనం పథకాలకు సన్న బియ్యమే సరఫరా చేస్తున్నది.
ముందే ఊహించిన సీఎం కేసీఆర్
దొడ్డు ధాన్యానికి కాలం చెల్లుతున్నదనే విషయాన్ని సీఎం కేసీఆర్ ముందే గుర్తించారు. గత వానకాలంలోనే రైతులకు సన్నాలను సాగు చేయాలని సూచించారు. వానకాలంలో 53 లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యింది. ఇందులో 39.66 లక్షల ఎకరాల్లో సన్నాలు, 13.34 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేశారు. అయితే అకాల వర్షాలు దెబ్బతీశాయి. ప్రకృతి సహకరించి ఉంటే భారీగా సన్నాల దిగుబడి వచ్చేది. అప్పటికీ మిల్లర్లు సుమారు 40 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో ఎక్కువభాగం సన్నరకమే. భవిష్యత్ ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్.. సన్నాలను సాగు చేయాలని పిలుపునివ్వడంపై ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. ఇప్పుడు కేంద్రమే దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయలేమంటున్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం సమాధానం చెప్తాయో చూడాలి. నాడు రైతుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొనే, వారికి నష్టం రావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వంద శాతం నిజమని తేలింది.
వరి సాగు తగ్గిస్తే మరింత మేలు
రైతులు వరి సాగును తగ్గిస్తే మరింత మేలని వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వరి సాగు భారీగా పెరగడం వల్ల భవిష్యత్లో కొనుగోలుకు ఇబ్బందులు తప్పవని, స్టోరేజీకీ సమస్య వస్తుందని అంటున్నారు. వరిసాగుకు ప్రత్యామ్నాయంగా పత్తి, కంది, నూనెగింజలు, ఇతర పప్పు గింజల సాగు చేస్తే రైతులకు మరింత లాభమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూనె గింజలకు, పప్పు గింజలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నందున వరిసాగు తగ్గించి ఇతర పంటల వైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
వరిసాగు తగ్గించడమే మంచిది
ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో రైతులు వరి తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే ఉపయోగకరం. ముఖ్యంగా పత్తి, కంది, నూనెగింజల సాగు వైపు ఆలోచించాలి. మార్కెట్లో వీటికి డిమాండ్ ఉన్నది. కాబట్టి రైతులు ఈ వానకాలం సీజన్లో వరిసాగును తగ్గించాలి.
-నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
సన్నాలైతే కొనుగోలు చేయగలం
రాష్ట్రంలో సన్నాలకు భారీ డిమాండ్ ఉన్నది. రైతులు సన్నాలను పండిస్తే మంచి లాభం ఉంటుంది. మిల్లర్లు సొంతంగానే ఎంత మొత్తమైనా సన్నాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. మార్కెట్లోనూ సన్న బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో సన్నాలు పండించాలంటూ సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం వందశాతం మంచి నిర్ణయం.
–నాగేందర్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు