నిజాంసాగర్/ నస్రుల్లాబాద్/ మద్నూర్/తాడ్వాయి/ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది కొవిడ్ నిబంధనలు, టీకాపై శనివారం విస్తృతంగా అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో సర్పంచులు పర్యటించి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 45 ఏండ్లు దాటిన వారు టీకా వేయించుకోవాలని అన్నారు.
నస్రుల్లాబాద్ మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వ్యాపారులు, గ్రామస్తులకు డీఎస్పీ జైపాల్రెడ్డి కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై మశ్చేందర్ రెడ్డి, సర్పంచ్ సాయిలు గ్రామస్తులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో వ్యాపారులతో ఎస్సై రాజు సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణాల వద్ద కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో సోమవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు.
తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు మాస్కు ధరించకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని ఎస్సై కృష్ణమూర్తి అన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో మండల కేంద్రంలోని వ్యాపారులు, ఆటోడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు మాస్కులు ధరించాలని, ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా చూడాలని సూచించారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని బస్టాండ్ వద్ద ఎస్సై-2 మధుసూదన్రెడ్డి కొవిడ్ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. సాధ్యమైనంతగా ప్రయాణాలు చేయకుండా ఇంటివద్ద ఉండడడే క్షేమమని సూచించారు. మాస్కులు తప్పకుండా ధరించాలని, వివిధ కార్యక్రమాలకు అవసరమైతే తప్ప హాజరుకావద్దని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు రాధాకిషన్, నిరోష, అర్జున్గౌడ్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ మండలం హన్మాజీపేట్లో సర్పంచ్ బోనాల సుభాష్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించకుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిమానా విధిస్తామని అన్నారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించారు. దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో సర్పంచ్ రమేశ్గౌడ్ వైద్యసిబ్బందితో కలిసి గ్రామంలో కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.