పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన తలారి లక్ష్మీ(40) రోజు మాదిరిగానే పొలంలో కలుపు తీయడానికి వెళ్లింది. లక్ష్మీ పొలంలో పనులు చేస్తుండ గా హఠాత్తుగా పాము కాటు వేసింది. గమనించిన లక్ష్మీ పక్క పొలంలో ఉన్న భర్త రాములుకు విషయాన్ని తెలిపింది. లక్ష్మీ కుమారుడు వెంటనే 108కు సమాచారం అందించాడు. చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు లక్ష్మీకి భర్త, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీ మరణంతో నాగులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.