బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవాఖానలో రోగులు, వారి బంధువులు, సహాయకులకు నిరంతరాయంగా జరుగుతున్న అన్నదానానికి శనివారం నాటికి మూడేండ్లు పూర్తయ్యాయి. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్నారు. దవాఖానకు వచ్చే రోగుల బంధువులు, సహాయకులు ఆకలి తీర్చుకోవడం కోసం పడేపాట్లను గమనించిన కవిత.. మూడేండ్ల కిందట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2018 ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడేండ్లు పూర్తిచేసుకుని ఆదివారం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టడంతో దవాఖాన సిబ్బంది, రోగుల సహాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. లాక్డౌన్లోనూ, ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ కవిత తలపెట్టిన అన్నదాన కార్యక్రమం ఆగలేదు.