కరాచీ : భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమెపై యాసిడ్ పోసి కత్తిపోట్లకు గురిచేసిన ఘటన కరాచీలో వెలుగుచూసింది. క్విదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్తకుండీలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం పడిఉండటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫెర్పావ్ కాలనీకి చెందిన మహిళ భర్త ఆసిఫ్ తన భార్య ఐషా (పేరుమార్చాం)ను వ్యభిచారం చేయాలని పట్టుబడుతూ వేధింపులకు గురిచేసేవాడు.
తన స్నేహితులతో గడపాలని చిత్రహింసలు పెట్టాడు. ఆసిఫ్ ఆగడాలు భరించలేక అతడి మొదటి భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు.గత నెల 23 రాత్రి పొద్దుపోయిన తర్వాత తప్పతాగి ఇద్దరు స్నేహితులను తీసుకుని ఇంటికి వచ్చిన ఆసిఫ్ తన స్నేహితులతో గడపాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఐషా నిరాకరించడంతో ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమె ముఖంపై యాసిడ్ పోసి పలుమార్లు కత్తితో పొడిచారు. బాధితురాలి మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసి పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసిఫ్ సహా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.