లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు ఏమాత్రం బ్రేక్ పడటం లేదు. హపూర్ జిల్లాలోని గర్ ముక్తేశ్వర్ ప్రాంతంలోని హోటల్లో మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గర్ ముక్తేశ్వర్ పట్టణానికి చెందిన మహిళకు వితంతు ఫించన్ ఇప్పిస్తామని, దరఖాస్తును పూర్తి చేసేందుకు నిందితులు ఇద్దరు ఆమెను హపూర్కు తీసుకువెళ్లారు. ఆపై తిరిగివస్తుండగా మంచినీరు తాగేందుకని హోటల్లో ఆగారు.
హోటల్ రూమ్లో బాధితురాలిని బంధించి ఇద్దరు నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న మహిళ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిచయమున్న వ్యక్తులేనని నమ్మి వెళ్లినందుకు తనపై దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి సమచారం లేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం.