లక్నో: కోతుల దాడిలో ( Monkeys attack ) ఓ బీజేపీ నాయకుడి భార్య మృతిచెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ చౌహాన్, సుష్మా దేవి (50) ఇద్దరూ భార్యాభర్తలు. మంగళవారం మధ్యాహ్నం సుష్మా దేవి తన ఇంటి మూడో అంతస్తులో ఉండగా ఒక్కసారిగా కోతుల మంద దాడిచేసింది.
కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె భవనం మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.