న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి ఐసీయూలో ఉన్న మహిళ ఐస్క్రీమ్ తినడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. ఆమె మరణంపై ఆసుపత్రి సిబ్బందిని నిలదీసి న్యాయం కోసం సామాజిక మాధ్యమాల్లో గళమెత్తిన మేనల్లుడు హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో జరిగిన ఈ ఘటనలపై పెద్ద దుమారం రేగుతున్నది.
నాగాలాండ్లోని దిమాపూర్కు చెందిన శామ్యూల్ సంగ్మా, ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న మేనత్త రోసితో కలిసి ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. జూన్ 23 రాత్రి వేళ చేతులు, కాళ్లలో నొప్పితోపాటు రక్తస్రావంతో బాధపడుతున్న రోసిని మేనల్లుడు శ్యామూల్ ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాగు. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉండటంతో జూన్ 24న మెరుగైన వైద్యం కోసం గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్కు తరలించాడు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని శ్యామూల్ తెలిపాడు. అయితే ఐసీయూలో ఉన్న తన మేనత్తకు డాకర్ల సమక్షంలో ఐస్క్రీమ్ ఇచ్చారని, అది తిన్న తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని ఆరోపించాడు. న్యాయం జరుగాలంటూ ఆసుపత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ప్రశ్నించిన తనపైనా ఆసుపత్రి సిబ్బంది దాడి చేసి బయటకు నెట్టివేశారని అందులో ఆరోపించాడు.
కాగా, మరునాడు జూన్ 25న హోటల్ గదిలో శ్యామూల్ అనుమానాస్పదంగా మరణించాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి మరణాలపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐసీయూలో ఉన్న రోగికి ఐస్క్రీమ్ ఇందుకు ఇచ్చారు, ఆమె మరణాన్ని ప్రశ్నించిన శ్యామూల్ ముఖం, శరీరంపై గాయాలు ఎలా అయ్యాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రోసీ తన ఇష్టపూర్వకంగానే ఐస్క్రీమ్ తిన్నదని, ఆసుపత్రి సిబ్బందితో ఘర్షణ అనంతరం శ్యామూల్ గురించి తమకు తెలియదని ఆసుపత్రి యాజమాన్యం వివరించింది.
అయితే, తన కుమారుడిది ఆత్మహత్య కాదని ఆయన తండ్రి మీడియాకు తెలిపారు. జూన్ 25 ఉదయం 5.30 గంటలకు శ్యామూల్ తనతో ఫోన్లో మాట్లాడాడని, మేనత్త రోసి మరణంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పాడని, అనంతరం కొన్ని గంటల్లో తన కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చిందన్నారు. ఇద్దరి మరణాలపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
మరోవైపు ఈ రెండు ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరుపాలని కోరుతూ మేఘాలయా ఎంపీ అగాథ సంగ్మా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కాగా, ఢిల్లీ పోలీసులతోపాటు గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.