ఏప్రిల్ మొదటి వారంలో కరోనా బారిన 50 మంది
హోం ఐసొలేషన్లో 44 మంది రికవరీ
ఊపిరిపీల్చుకున్న గ్రామస్తులు
తిమ్మాపూర్ రూరల్, మే1: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడిన ఆ పల్లె కోలుకున్నది. ఇండ్ల వద్దే చికిత్సపొందుతూ కట్టుదిట్టమైన చర్యలతో క్రమేణా తేరుకున్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామ జనాభా 1100. ఈ ఊరిలో ఏప్రిల్ మొదటివారంలో కరోనా విలయతాండవం సృష్టించింది. గత నెల 4న అనుమానిత లక్షణాలున్న ఓ మహిళ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రైమరీ కాంటాక్ట్ అయిన మరికొందరికీ పరీక్షలు చేయగా ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే అప్రమత్తమై సర్పంచ్ అంజియాదవ్ మండల వైద్యాధికారు లను సంప్రదించి మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. మొత్తం 270 మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
ఎక్కడికక్కడ కట్టడి..
పెద్దసంఖ్యలో గ్రామస్తులు కొవిడ్ భారిన పడడంతో సర్పంచ్ అంజయ్య నేతృత్వంలోని పాలకవర్గం వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 7 నుంచి 22 దాకా లాక్డౌన్ విధించారు. నిబంధనలు పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కరోనా బాధిత కుటుంబాలకు గ్రామానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు అండగా నిలిచారు. గుడ్లు, డ్రైప్రూట్స్, నిత్యావసరాలు అందించారు.
సర్కారు వైద్యంపై నమ్మకం..
కరోనాభారిన పడ్డ 50 మందిలో ఏ ఒక్కరూ ప్రైవేట్ దవాఖానకు వెళ్లలేదు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఇచ్చిన మెడికల్ కిట్లలోని మందులనే వాడారు. వారు చెప్పిన జాగ్రత్తలను తు.చ. తప్పకుండా పాటించారు. ప్రస్తుతం 44 మంది కరోనా కోరల్లోంచి బయటపడ్డారు. ఆరుగురు స్వల్పలక్షణాలతో హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కోక్కరికీ నెగెటివ్ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
నిత్యం శానిటైజ్ చేశాం..
గ్రామంలో కరోనా కేసులు వెలుగుచూడగానే అప్రమత్తమైనం. లాక్డౌన్ విధించి ప్రజలెవరూ బయటకు పోకుండా కట్టడి చేసినం. బాధితుల ఇండ్ల వద్ద నిత్యం శానిటైజ్ చేయించినం. వైద్య శాఖ అధికారులు నిత్యం పర్యటించి మందులు, కిట్లు అందజేశారు. వైరస్ సోకిన వారికి భరోసా కల్పించారు. దీంతో ఎవరూ కూడా సీరియస్ కాలేదు.
-మల్లెత్తుల అంజయ్య యాదవ్, సర్పంచ్