ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ నో ఎంట్రీ అని ఆస్ట్రేలియా చెప్పడంతో ఇండియా నుంచి మాల్దీవ్స్కు వెళ్లి.. అక్కడి నుంచి ఎలాగోలా ఇంటికి వెళ్లాలని చూస్తున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్స్ ఇప్పటికే సేఫ్గా ఇంటికెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ.. తన టీమ్లోని ప్లేయర్స్కు అండగా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానని, క్యాంప్ నుంచి ఇంటికి వెళ్లే ఆఖరి వ్యక్తి తానే అవుతానని ధోనీ చెప్పడం విశేషం.
చెప్పినట్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరారా లేదా అన్నది ఆరా తీస్తున్నాడు. ముందు విదేశీ ప్లేయర్స్ వెళ్లాలని, తర్వాత దేశీయ ఆటగాళ్లు వెళ్లాలని ఓ వీడియో చాట్లో ధోనీ చెప్పాడు. చివరగా తాను వెళ్తానని ధోనీ అన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.
మహీభాయ్ అందరూ సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిసిన తర్వాతే హోటల్ నుంచి వెళ్తానని చెప్పాడు. హోటల్ నుంచి చివరిగా వెళ్తే వ్యక్తి తానేనని ధోనీ అన్నాడు అని చెన్నై టీమ్ సభ్యుడు ఒకరు వెల్లడించాడు. తమ ప్లేయర్స్ను చెన్నై చార్టర్డ్ ఫ్లైట్లో ముంబై, రాజ్కోట్లకు తరలించింది. బుధవారం సాయంత్రం మరో విమానంలో కొందరు ప్లేయర్స్ను బెంగళూరు, చెన్నైలకు పంపించింది. గురువారం సాయంత్రం ధోనీ రాంచీ వెళ్లనున్నాడు.
ఇక ముంబై ఇండియన్స్ మాత్రం తమ విదేశీ ప్లేయర్స్ అందరినీ చార్టర్డ్ విమానాల్లో పంపిస్తుండటం విశేషం. ఇలా విదేశీ ప్లేయర్స్కు ప్రత్యేక ఏర్పాటు చేసిన టీమ్ ఇదొక్కటే. ఈ విమానాలు సౌతాఫ్రికా మీదుగా న్యూజిలాండ్, వెస్టిండీస్ వెళ్లనున్నాయి. మిగతా ఐపీఎల్ టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ను కూడా తీసుకెళ్తామని ముంబై టీమ్ చెప్పడం విశేషం.