లక్నో: ఒక వ్యక్తి ఐదో పెళ్లి ప్రయత్నం ఫలించలేదు. పెళ్లి వేదిక వద్ద వరుడ్ని అడ్డుకున్న భార్యలు, పిల్లలు అతడ్ని చితక్కొట్టారు. ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ కజియారే ప్రాంతంలో బుధవారం 55 ఏళ్ల షఫీ అహ్మద్ పెళ్లి జరుగుతోంది. ఈ విషయం తెలిసిన అతడి మాజీ, ప్రస్తుత భార్యలు, పిల్లలు అక్కడకు వచ్చారు. వరుడు షఫీని పట్టుకుని చితకబాదారు. దీంతో భయపడిన వధువు అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, వరుడు షఫీ ఇప్పటికే నాలుగు పెళ్లిల్లు చేసుకున్నాడు. మొదటి, రెండో భార్యలకు విడాకులు ఇచ్చాడు. గుట్టుగా మరో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు సంతానం కలిగారు. తాజాగా ఐదో పెళ్లికి అతడు సిద్ధమయ్యాడు.
మరోవైపు ప్రస్తుత, మాజీ భార్యలతోపాటు వారి పిల్లలకు ఈ విషయం తెలిసింది. దీంతో వారంతా కలిసి పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. ఐదో పెళ్లి చేసుకుంటున్న షఫీ అహ్మద్ను అడ్డుకున్నారు. అతడ్ని పట్టుకుని చితకబాదారు. దీంతో వధువు అక్కడి నుంచి పారిపోయింది. ఆమె కూడా షఫీతో మూడో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కాగా, పిల్లల ఫిర్యాదుతో షఫీ అహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.