హయత్నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్నగర్ డివిజన్ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న వ్యక్తితో పాటు తోడుగా వస్తున్న వ్యక్తిని స్థానికులు అనుమానంతో చితకబాదారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన డేగ శ్రీనివాస్కు లక్ష్మితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు భవాని(9), కుమారుడు నందు (6) ఉన్నారు.
శ్రీనివాస్ కుటుంబంతో హయత్నగర్లోని హనుమాన్ టెంపుల్ సమీపంలో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. గత 20 రోజులుగా లక్ష్మి అనారోగ్యానికి గురై గురువారం రాత్రి మృతిచెందడంతో ఏమి చేయాలో దిక్కుతోచక స్నేహితుడు వినోద్కు సమాచారమిచ్చాడు. అతని సహకారంతో లక్ష్మి మృతదేహాన్ని బాతుల చెరువు సమీపంలో పాతిపెట్టేందుకు దుప్పట్లో చుట్టుకుని భుజాన మోసుకెళ్తుండగా గమనించిన స్థానికులు వారిని నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
విషయం తెలుసుకున్న హయత్నగర్ సీఐ సురేందర్, సిబ్బందితో వెళ్లి లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శ్రీనివాస్, వినోద్తోపాటు చిన్నారులు భవాని, నందును పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా సీఐ మాట్లాడుతూ అనారోగ్యం వల్లనే లక్ష్మి మృతిచెందినట్లుగా భావిస్తున్నాం. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశాం. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం అన్నారు.