మేడ్చల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కల్తీ విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా ఉన్న విత్తన కంపెనీలపై టాస్క్ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 29 విత్తన కంపెనీలు, స్టోరేజీ ప్లాంట్లను పరిశీలించి రికార్డుల్లో నమోదు కాని 3570 క్వింటాళ్ల విత్తనాలపై నిషేధం విధించారు. ఇందులో వరి, మొక్కజొన్న, కూరగాయలు విత్తనాలు ఉన్నాయని.. వీటి విలువ సుమారు రూ. 2.25 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. మరో రెండు కంపెనీలపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన విత్తనాలను విక్రయించవద్దని.. విత్తనాల శాంపిల్స్ను వివిధ ల్యాబ్లకు పంపామని.. నకిలీ కాదని తేలిన తర్వాతే విక్రయించేందుకు అనుమతి ఇస్తామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యవసాయాధికారిణి మేరి రేఖ వెల్లడించారు. వారం రోజులుగా విత్తన కంపెనీలతో పాటు షాపుల్లోనూ తనిఖీలు చేస్తున్నామి వివరించారు.
కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అంటున్నారు.అంతేకాక కంపెనీ, డీలర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని పేర్కొంటున్నారు. వానకాలం సీజన్ ముగిసే వరకు తనిఖీలు కొనసాగుతాయని వారు వివరిస్తున్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకే విత్తన కంపెనీలు, డీలర్ల దుకాణాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు 29 విత్తన కంపెనీల్లో వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 3570 క్వింటాళ్ల విత్తనాలు సీజ్ చేశాం. వీటి విలువ రూ.. 2.25 కోట్ల వరకు ఉంటుంది. మరో రెండు కంపెనీలపై కేసులు నమోదు చేశాం. – మేరీ రేఖ, మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి