లక్నో : పదేండ్ల కిందట తన కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని హత్య చేసిన 70 ఏండ్ల మహిళకు యూపీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. బులంద్షహర్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజేశ్వర్ శుక్లా వృద్ధురాలు కస్తూరి దేవిని దోషిగా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.2010 జులై 31 అర్ధరాత్రి కస్తూరి దేవి ఇంట్లోకి చొరబడిన ప్రవీణ్ కుమార్ ఆమె కూతురు (20)పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ దృశ్యం చూసిన కస్తూరి దేవి ప్రవీణ్పై గొడ్డలితో దాడి చేసింది. మెడపై ఐదుసార్లు గొడ్డలితో వేటు వేసింది.
తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రవీణ్ మరణించిన అనంతరం సాయం కోసం కస్తూరి దేవి అరవడం పధకం ప్రకారం చేసిన పనిగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రవీణ్పై గొడ్డలితో పాశవికంగా దాడి చేయకుండా కొద్దిపాటి ప్రతిఘటనతో లైంగిక దాడిని తప్పించడం సాధ్యమయ్యేదని అభిప్రాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో కస్తూరి దేవి వయసు 59 ఏండ్లు కాగా ఆపై ఆమె కుమార్తెకు వివాహమై సంతానం కలిగింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన కస్తూరి కూతురు, కొడుకు ప్రవీణ్ లైంగిక దాడికి ప్రయత్నించడంతోనే తమ తల్లి గొడ్డలితో అతడిపై దాడి చేసిందని పేర్కొన్నారు.