నేడు అత్యధికంగా దాఖలయ్యే అవకాశం
అభ్యర్థుల ఎంపికకు ప్రతిపక్షాలు మల్లాగుల్లాలు
ఖమ్మం ఏప్రిల్ 16:నగరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. చిన్న పట్టణం నుంచి ఇంతింతై కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చిన ఖమ్మం తొలి మున్సిపాలిటీ ఎన్నికల నుంచి మొదటి కార్పొరేషన్ ఎన్నికల వరకు తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తోంది. 1910లో అప్పటి నిజాం ప్రభుత్వం పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది. తొలుత రెవెన్యూశాఖ నుంచి తహసీల్దార్ మున్సిపల్ అధికారిగా వ్యవహరించేవారు. 1952లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చిర్రావూరి లక్ష్మీనర్సయ్య గెలిచారు. దినదినాభివృద్ధి చెందుకుంటూ 2012లో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. అప్పటినుంచి 2016 వరకు కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు. 2016లో నిర్వహించిన తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఖమ్మం తొలి మేయర్గా డాక్టర్ గుగులోత్ పాపాలాల్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండోసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఎదిగిన తీరు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరిగాయి, తదితర అంశాలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
నేడు అత్యధికంగా దాఖలయ్యే అవకాశం
అభ్యర్థుల ఎంపికకు ప్రతిపక్షాలు మల్లాగుల్లాలు ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలు కాగా తొలిరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. 6వ డివిజన్ నుంచి ఒకరు, 35వ డివిజన్ నుంచి ఒకరు, 43వ డివిజన్ నుంచి ఒకరు , 49వ డివిజన్ నుంచి ఒకరు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం చవితి కారణంగా నామినేషన్లు దాఖలు కాలేదు. శనివారం ఎక్కువ నామినేషన్లు దాఖలు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కొన్ని డివిజన్లలో ఒక్క అభ్యర్థి కూడా దొరకడం లేదని స్థానికంగా చర్చ నడుస్తున్నది. నామినేషన్ దాఖలుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. మరికొందరు అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు