సంగెం : గొర్రెల మందపై కారు దూసుకెళ్లటంతో 25 గొర్రెలు మృతిచెందిన ఘటన మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రెల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన వేల్పుల చేరాలు, కమ్మాల కుమారస్వామి తమ గొర్రెలను మేతకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. సంగెం-తీగరాజుపల్లి రోడ్డుపై సంగెం వైపు నుంచి వచ్చిన కారు అతివేగంగా గొర్లమందపై దూసుకెళ్లడంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో పది గొర్రెలకు తీవ్ర గాయలయ్యాయి.
గమనించిన కారు డ్రైవర్ కారు ఆపకుండానే వేగంగా తీగరాజుపల్లి వైపు వెళ్లిపోయాడు. మృతిచెందిన గొర్రెలు 2లక్షల విలువ ఉంటాయని యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. 25 గొర్రెల మృతికి కారకుడైన కారు డ్రైవర్ను గుర్తించి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన స్థలికి సంగెం ఎస్సై భాస్కర్రెడ్డి చేరుకుని మృతిచెందిన గొర్రెలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.