కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ చెరువులో మంగళవారం సాయంత్రం తూము నుంచి నీళ్లు తీయడానికి తూములోకి దిగిన పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బోయిని పెద్ద మల్లయ్య (35) మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విఠల్రెడ్డి, పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతుని వివరాలు తెలుసుకున్నారు. పంట చేన్లకు నీళ్లు వదలడానికి నీరటిగా పని చేస్తున్నబోయిని పెద్ద మల్లయ్యను గ్రామస్తులు పెట్టుకున్నారు. పొలాలకు నీళ్లు వదిలే క్రమంలో సోమవారం సాయంత్రం తూము తీయడానికి వెళ్లగా నీళ్లు రాక పోవడంతో తూము నుంచి నీళ్లు వెళ్లే దగ్గర ఉన్న సంచులను తొలగించడానికి చెరువులోకి మునిగా సంచులను తొలగించే క్రమంలో నీటి ప్రవాహానికి అక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో కులకచర్ల ఎస్ఐ విఠల్రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చెరువుతూము దగ్గర మృతి చెందిన మల్లయ్య మృతదేహాన్ని బయటకు తీయాలని గ్రామస్తులకు కోరగా నిండుకుండగా ఉన్న చెరువులోకి దిగి మృతదేహాన్ని బయటకు తీయడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్ఐ విఠల్రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ సాహసం చేసి నీటిలోకి మునిగి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని బయటకు తీయడంతో గ్రామస్తులు, మండల ప్రజలు వారిద్దరిని అభినందించారు. కాగా పుట్టపహాడ్ దగ్గర ఉన్న చెరువు రెవెన్యూ పరిధి మహాబూబ్నగర్ జిల్లా మహామ్మదా బాద్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. దీంతో మహమ్మదాబాద్ పోలీసులు మృతదేహాన్ని మహాబూబ్నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.