దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ్యాపారం చేసే వెంకట్రాములు, బాలమ్మ దంపతులు. వినాయక చవితి పండగ వస్తుండటంతో తామర పువ్వుల తెంపి అమ్ముకునేందుకు దండెంకుంటలోని వాటిని తెంపేందుకు దిగాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడం తో అతని భార్య బాలమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు విషయం ఆరా తీసి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నాచులో చుట్టుకుపోయిన వెంకట్రాములు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడి భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.