ఎక్కడ తవ్వినా.. పురాతన వస్తువులు, శిలాశాసనాలే
చారిత్రక వైభవాన్ని తెలిపేలా ఆనవాళ్లు
శిలపై ముత్తాత, మునిమనవడి శాసనాలు
కలిసిపోతున్న మరికొన్ని చరిత్ర సాక్ష్యాలు
ముగొండ, మే 31 : ముదిగొండ మండలంలోని చిన్న గ్రామమైన కట్టకూరు కాకతీయుల చరిత్ర సాక్ష్యాలకు మాత్రం పెద్ద ఆనవాలుగా ఉన్నది. పురాతన కాలంలో వాడిన వస్తువులు, శిలలు, రాళ్లు, బండలు ఈ ఊళ్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ తవ్వినా ఏదో ఒక పురాతన వస్తువు బయట పడుతూనే ఉంది. హన్మకొండ రాజధానిగా దాదాపు దక్షిణ భారతదేశం మొత్తం పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలోనే ఇప్పటి ముదిగొండ మండలం ఉన్నట్లు అక్కడక్కడా చారిత్రక సాక్ష్యాలు గతంలోనే లభించాయి. ఇక్కడి ఆలయాలు కూడా వారు కట్టించిన దేవాలయాల ఆకృతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం కట్టకూరులో లభించిన శిలాశాసనం కాకతీయుల రాజ్య పరిపాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇందులో మరో కోణం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ లభించిన శిలా పలకాలు, శాసనాల్లో ఒక శిలపై ఒక రాజుకు సంబంధించిన శాసనం మాత్రమే ఉండేది. కానీ ఈ శిలపై మాత్రం ముత్తాత, మునిమనవడు ఇచ్చిన దానానికి సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఒక రాజు శాసనం వేయించి 105 సంవత్సరాల తరువాత మరొకరు వేయించిన శాసనం లభించటం అరుదైన విషయం.
ప్రముఖ చరిత్రకారుడు కట్టా శ్రీనివాసరావు ఒక గ్రంథాలయంలో తన పరిశోధనలో భాగంగా ఒక చరిత్ర పుస్తకం చదువుతుండగా గణపతి దేవుడు కట్టకూరు గ్రామంలో గోపీనాథ స్వామి ఆలయానికి ఇచ్చిన దానం విషయం లభ్యమైంది. దాని గురించి పరిశోధించగా ముదిగొండ మండలంలో ఆ ఊరు ఉన్నదని తెలుసుకొని అక్కడికి వచ్చారు. ఆ శాసనం గురించి గ్రామస్తులను అడిగితే ఆయన్ను వింతగా చూశారు. తమ ఊళ్లో ఎక్కడ తవ్వినా ఏదో ఒక రాయి దొరుకుతుందని చెప్పారు. దీంతో ఆయన మంలోని అక్కడక్కడా ఉన్న శిలలను పరిశీలించగా 925 ఏళ్ల నాటి శాసనం బయటపడింది. ఇది అక్కడకు ఎలా వచ్చిందని ఆరా తీశారు. ఒక రైతు పొలం గట్టున ఈ శిలా శాసనం ఎప్పటి నుంచో నిలబెట్టి ఉందని, పొలంలో పనులు చేసేటప్పుడు ఈ రాయి అడ్డుగా ఉన్నదని భావించి కొన్నిరోజుల క్రితం జేసీబీతో తీయించి పక్కకు పడేశారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
ఇది సాధారణ రాయి కాదని, కాకతీయరాజులు చేసిన దానాలు గురించి వేయించిన శాసనమని గుర్తించారు. కాకతీయ రాజైన గణపతి దేవుడు 1198లో శాసనం వేయించగా 1303లో ఆయన ముని మనవుడు, రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు ఆ శిలకు మరో వైపున శాసనం వేయించారు. ఈ రెండు శాసనాలూ గ్రామంలో నిర్మించిన గోపీనాథ స్వామి ఆలయానికి ఇచ్చిన దానాన్ని సూచిస్తున్నట్లు తెలిపారు. 1198 ఏప్రిల్ 21 మంగళవారం శ్రీ గోపీనాథ స్వామి తిరు ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠాపన, ఉత్సవాలు జరపడానికి పన్ను సమకూర్చాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. చక్రవర్తి గణపతి దేవుడు దీనికి సమ్మతించి బుర్ర సుంకం (తలకు – ప్రతి మనిషి చెల్లించాల్సిన పన్ను) వసూలు చేసి ఆ మొత్తం దేవాలయానికి ఇవ్వాలని ఆ శాసనంలో ఉన్నది. ఆరు అడుగుల ఎత్తు, అడుగు మందం వెడల్పుతో ఉన్న గ్రానైట్ రాయిపై శాసనం వేయించారు. దీనికి వెనుక వైపున 105 ఏళ్ల తరువాత కాకతీయ సామ్రాజ్యం పతనానికి 20 ఏళ్ల ముందు గణపతి దేవుడు ఆలయ ఉత్సవాలకు పన్ను రూపంలో నిధులు సేకరించినట్లుగా మరో శాసనం ఉన్నది. బహుషా ఆలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు జరపడానికి ఈ దానం ఇచ్చి ఉండొచ్చని చరిత్రకారుడు కట్టా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.