ముంబై : సంచలనం సృష్టించిన రాజ్కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో పలు విషయాలు బయటపడుతున్నాయి. అశ్లీల వీడియోలు చిత్రీకరించేందుకు తమను ఎలా వేధింపులకు గురిచేశారనే వివరాలను బాధితులు వెల్లడించారు. నిందితుడు తమను బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనేలా ప్రేరేపిస్తూ వాటిని రికార్డు చేసి ఆ కంటెంట్ను రాజ్కుంద్రాకు విక్రయించడంతో పాటు ఇతర యాప్ యజమానులకూ విక్రయించి సొమ్ముచేసుకునే వాడని తెలిపారు.
తాను ఇన్స్టాగ్రాం సమాచారం ద్వారా ఆడిషన్కు వెళ్లానని ఓ బాధితురాలు వెల్లడించారు. తొలుత తనను కెమెరా ఎదుట పలు భంగిమల్లో ఫోజులు ఇవ్వాలని కోరారని, ప్రతిసారీ అశ్లీల మోతాదు పెంచుతూ వెళ్లారని చెప్పారు. దీనికి అభ్యంతరం చెప్పడంతో షూటింగ్కు అయిన వ్యయం భరించాలని బెదిరించారని వెల్లడించారు. మరో బాధితురాలు లాక్డౌన్తో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆడిషన్కు వెళ్లానని చెప్పుకొచ్చారు. నిర్వాహకులు తనకు ఓ స్క్రిప్ట్ ఇచ్చారని, తనను రాణిలా నటించాలని కోరారని చెప్పారు.
ఆడిషన్ సెటప్పై అనుమానం రావడంతో తాను అక్కడినుంచి వెళ్లేందుకు సిద్ధపడగా నిందితుడు తనను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. తాను బిగ్గరగా ఏడవడంతో ఎక్కువ మేకప్ వేసి చిత్రీకరణ జరిపారని చెప్పారు. వీడియోలో కనిపించే మరో నటుడితో తనపై లైంగిక దాడి చేయించారని ఆ వీడియోను నిందితుడు షూట్ చేశాడని తెలిపారు. పోర్న్ కంటెంట్తో షూటింగ్ చేసిన తర్వాత తన చేతిలో కేవలం రూ 10,000 పెట్టి అక్కడినుంచి పంపించేశారని ఆమె వివరించారు.