లక్నో : మాజీ ప్రియురాలిని, ఆమె సోదరుడిని ఇరికించేందుకు ఓ వ్యక్తి తన బిడ్డను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని ధౌరా గ్రామంలో చోటు చేసుకుంది. బాబ్లూ ప్రజాపతికి 13 ఏండ్ల కూతురు ఉంది. అయితే అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దశాబ్ద కాలం పాటు వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగింది. ఇటీవల కాలంలో ఆమె బాబ్లూకు దూరమైంది. ఆమె సోదరుడికి ఇచ్చిన రూ. 30 వేలు కూడా తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆమెతో పాటు అతనిపై కూడా బాబ్లూ పగ పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా జైలు పాలు చేయాలని నిశ్చయించుకున్నాడు బాబ్లూ.
దీంతో తన 13 ఏండ్ల కుమార్తె మాయను బాబ్లూ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు వద్దకు వెళ్లి.. తన బిడ్డను 9 మంది కలిసి హత్య చేశారని, ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారని బాబ్లూ తెలిపాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా బాబ్లూను పోలీసులు అనేకసార్లు ప్రశ్నించారు. అతను చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో తానే మాయను హత్య చేశానని అంగీకరించాడు. తనకు దూరమైన మాజీ ప్రియురాలిని, ఆమె సోదరుడిని జైలు పాలు చేసేందుకే ఈ కుట్ర చేశానని బాబ్లూ తెలిపాడు. దీంతో బాబ్లూను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.