హైదరాబాద్ : అనుమానాస్పద మృతి కేసును నగరంలోని ఉప్పల్ పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ నెల 21న ఉప్పల్ శిల్పారామ వద్ద గల హెచ్ఎండీఏ లేఅవుట్లో కాలిన స్థితిలో ఓ మృతదేహం లభించింది. లేఅవుట్ సూపర్వైజర్ నరేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. గుర్తింపు నిమిత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయితే బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని వివరాలు, మృతదేహంపై లభించిన గుర్తులు పోలడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సాంకేతిక అంశాల ఆధారంగా పక్కా సమాచారాన్ని సేకరించారు. మృతుడిని బాలానగర్కు చెందిన కిరాణా దుకాణంలో పనిచేసే బాలరాజు(22)గా గుర్తించారు.
ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మహేశ్, నాగరాజు, సాయి ముగ్గురు స్నేహితులు సనత్ నగర్లో గల కల్లు కంపౌండ్లో కల్లు తాగారు. ఆ సమయంలో బాలరాజు అక్కడికి వచ్చాడు. వీరంతా కలిసి కల్లు, మద్యం సేవించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆటోలో కలిసి బాలరాజును డ్రాప్ చేశారు. బాలరాజును దించిన కొద్దిసేపటికి మహేశ్ తన ఫోన్ పోయినట్లుగా గుర్తించాడు. బాలరాజు తీసుకొని ఉంటాడని భావించి వెళ్లి అడిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది.
మహేశ్ తన సోదరులను సంఘటనా స్థలానికి పిలిచాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరంతా బాలరాజును విచక్షణారహితంగా కొట్టడంతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్కి తరలించి కిరోసిన్ పోసి తగులబెట్టారు. అనంతరం సంబంధికుల ఇళ్లలో ఆశ్రయం పొందారు. విచారణలో హత్య ఘటన వీడటంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆటో, బైక్, మూడు సెల్ఫోన్లు, మృతదేహాన్ని తగులబెట్టేందుకు ఉపయోగించిన లైటర్ను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నిందితులు వద్యావత్ మహేవ్(33), వద్యావత్ నరేశ్(36), వద్యావత్ సుధీర్(28), వద్యావత్ విజయ(25), కేతావత్ రవి(35).