లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. బరేలికి చెందిన బాలికపై మీరట్ జిల్లలోని ఓ మహిళా రాజకీయ నేత గృహంలో సామూహిక లైంగిక దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ మహిళా నేత ఆమె కుమారుడు మరిదిపై మీరట్లోని పల్లవపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జులై 15న తాను మహిళా నేత ఇంటికి రాగా తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారని ఆపై మహిళా నేత కుమారుడు, మరిది కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత బాలిక ఆరోపించింది.
తనను తుపాకీతో బెదిరించి లైంగిక దాడి ఘటనను వీడియోలో చిత్రీకరించారని ఆమె పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని నిందితులు తనను బెదిరించారని ఆమె తెలిపింది. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని మహిళా నేత పేర్కొన్నారు.