లక్నో: చెవిటి, మూగ పిల్లలతోపాటు మహిళలను మత మార్పిడి చేయించిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా మత మార్పిడికి పాల్పడుతున్న రాకెట్కు చెందిన ఇద్దరు నిందితులను ముఫ్తీ ఖాజీ జహంగీర్ ఖస్మి, మహ్మద్ ఉమర్ గౌతమ్లుగా గుర్తించారు. వీరిద్దరు దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్ నివాసితులని ఏటీఎస్ అధికారులు తెలిపారు. నోయిడాలోని చెవిటి, మూగ స్కూలుకు చెందిన 12 మందికిపైగా పిల్లలు, మహిళలతోపాటు ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందిని ఇస్లాం మతంలోకి మార్చారని చెప్పారు. రాష్ట్ర కొత్త మత మార్పిడి వ్యతిరేక చట్టం ప్రకారం గోమితినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇస్లామిక్ దావా సెంటర్ ఛైర్మన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లోప్రస్తావించినట్లు వివరించారు.
మత మార్పిడి రాకెట్కు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, దీనిపై తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని యూపీ ఏడీజీ (లా అండ్ ఆర్డర్ ) ప్రశాంత్ కుమార్ తెలిపారు. డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపి మత మార్పిడికి పురిగొల్పుతున్నారని, ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 300 మందిని మతం మారేలా చేసినట్లు ఇద్దరు నిందితులు దర్యాప్తులో చెప్పారన్నారు.