లక్నో: అనుమానాస్పదంగా మరణించిన కుమారుడి మృతదేహాన్ని తండ్రి 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్లో ఉంచారు. కుమారుడు హత్యకు గురైనట్లు ఆరోపించిన ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోనని అన్నారు. దిగి వచ్చిన అధికారులు మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏండ్ల శివాంక్ పాఠక్ 2012 నుంచి ఢిల్లీలోని కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. తనకు పరిచయమైన గుర్లీన్ కౌర్ అనే మహిళతో 2013లో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న శివాంక్ ఆగస్ట్ 1న అనుమానస్పదంగా మరణించారు. దీంతో మృతదేహానికి ఢిల్లీలో పోస్ట్మార్టం నిర్వహించి అతడి తండ్రికి అప్పగించారు.
అయితే, ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా మజావున్ గ్రామంలో నివాసం ఉంటున్న శివాంక్ తండ్రి, రిటైర్డ్ సుబేదార్, శివ ప్రతాప్ పాఠక్ తన కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. కుమారుడి పేరుపై ఉన్న ఆస్తులపై అతడి భార్య కన్నువేసిందని, ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో న్యాయం జరిగేంత వరకు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోనని చెప్పారు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా శివాంక్ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచి తన ఇంట్లో భద్రపరిచారు.
మరోవైపు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని, లేనిపక్షంలో శివప్రసాద్పై చర్యలు తీసుకుంటామని సుల్తాన్పూర్ జిల్లా అధికారులు హెచ్చరించారు. కాగా, యూపీలోని అధికార బీజేపీతోపాటు, ఎస్పీ, ఆప్ స్థానిక నేతలు శివ ప్రసాద్ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు దిగి వచ్చారు. కుమారుడి మృతదేహానికి మంగళవారం రీపోస్ట్మార్టం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డాక్టర్ల ప్యానెల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తుందని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీష్ గుప్తా వెల్లడించారు.