లక్నో : మాస్క్ ధరించే విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం ఓ వ్యక్తిపై కాల్పులకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కుమార్ అనే ఓ కస్టమర్ వచ్చాడు. అయితే అతడు మాస్క్ ధరించకపోయేసరికి సెక్యూరిటీ గార్డు అడ్డుకుని మాస్కు ధరించాల్సిందిగా కోరాడు. లేకపోతే బ్యాంక్ లోపలికి అనుమతించేది లేదని పేర్కొన్నాడు. సదరు వ్యక్తి మాస్క్ ధరించి సెక్యూరిటీ గార్డ్తో వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం.
ఈ వాగ్వాదం ముదరడంతో సెక్యూరిటీ గార్డ్ అతనిపై ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు బుల్లెట్ తొడలోకి దూసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు సెక్యూరిటీ గార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి దుర్భాషలాడంతో అప్పటికే లోడ్ అయి ఉన్న గన్ ట్రిగ్గర్ అనుకోకుండా నొక్కడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు.
బాధితుడి బంధువు ఒకరు మాట్లాడుతూ.. బ్యాంకులోకి ప్రవేశించే క్రమంలో గార్డు కుమార్ని మాస్క్ ధరించమని అడిగాడు. బయటకు వెళ్లి మాస్క్ ధరించి తిరిగి బ్యాంక్లోకి వెళ్తుంటే మళ్లీ అడ్డుకుని లంచ్ టైం అని చెప్పి లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గార్డ్ కావాలనే నెట్టివేసి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నాడు.