లక్నో: రూ.2 కోట్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కొందరు అతడ్ని హత్య చేశారు. అనంతరం పీపీఈ కిట్లు ధరించిన నిందితులు అతడు కరోనాతో చనిపోయినట్లుగా నమ్మించి దహనం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ యజమాని కుమారుడైన 23 ఏండ్ల సచిన్ చౌహాన్ను అతడి స్నేహితుడు, మరో నలుగురు కిడ్నాప్ చేసి అతడి పేరెంట్స్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ నెల 21న ఆగ్రాలోని మూతపడిన వాటర్ ప్లాంట్కు సచిన్ను తీసుకెళ్లి అతడితో కలిసి మద్యం సేవించారు. అనంతరం లామినేషన్ పేపర్తో సచిన్ ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్య గురించి ఎవరికీ తెలియకుండా, తమను ఎవరూ గుర్తించకుండా పీపీఈ కిట్లు ధరించిన ఐదుగురు సచిన్ కరోనాతో మరణించినట్లుగా నమ్మించి అతడి మృతదేహాన్ని దహనం చేశారు.
కాగా, కుమారుడు కనిపించకపోవడంతో సచిన్ తల్లి అతడి మొబైల్కు ఫోన్ చేయగా నిందితుల్లో ఒకరు ఫోన్ ఎత్తాడు. సచిన్ మాట్లాడలేనిస్థితిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో అనుమానించిన సచిన్ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఆగ్రా పోలీసులు చివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల కోసం సచిన్ను హత్య చేసేందుకు నిందితులు 25 రోజుల కిందటే ప్లాన్ వేసుకున్నారని పోలీస్ అధికారి వెల్లడించారు.