లక్నో: జీన్స్ ధరించిందన్న ఆగ్రహంతో ఒక బాలికను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. ఆమె చనిపోవడంతో వంతెన పైనుంచి పడేశారు. అయితే వంతెనకు చిక్కుకున్న మృతదేహం కొన్ని గంటలపాటు వేలాడుతూ కనిపించింది. ఉత్తరప్రదేశ్లోని డోరియా జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది.
17 ఏండ్ల బాలిక తండ్రి పంజాబ్లో వలస కూలీ. ఇటీవల ఆమెతో కలిసి తల్లి డోరియాలోని అత్తమామల ఇంటికి వచ్చింది. ఈ నెల 19న ఉపవాసం ఉన్న ఆ బాలిక సాయంత్రం స్నానం అనంతరం జీన్స్ ధరించింది. అయితే ఆమె డ్రెస్పై తాత అభ్యంతరం వ్యక్తం చేయగా ఆమె ఎదురు సమాధానం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తాత, బాబాయిలు ఆ బాలికను కర్రలతో దారుణంగా కొట్టారు.
అచేతనంగా పడిపోయిన బాలికను వారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. దీంతో మార్గమధ్యలో వంతెన పైనుంచి ఆమె మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అయితే బాలిక మృతదేహం వంతెనకు చిక్కుకోవడంతో కాలువలో పడలేదు.
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు కొన్ని గంటలపాటు బాలిక మృతదేహం వంతెనకు వేలాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తల్లి, పిన్ని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాతను అరెస్ట్ చేయగా బాబాయిలు పరారిలో ఉన్నారు.