లక్నో: పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ మెహంజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 54 ఏండ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు ఈ నెల 5న సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అత్యవసర పోలీస్ నంబర్కు ఫోన్ చేసింది.
అనంతరం తన భర్తతో కలిసి అజామ్గఢ్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. లైంగికదాడికి పాల్పడిన అనిల్ సింగ్తోపాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తమను నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారని, రాజీ కోసం ప్రయత్నించారని ఆ మహిళ భర్త ఆరోపించాడు.
మరోవైపు బాధిత మహిళ నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేయకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది. శనివారం అజామ్గఢ్ పోలీస్ స్టేషన్ వద్ద విషం సేవించింది. ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించగా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.
ఈ ఘటనను ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ సీరియస్గా తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ చున్నా సింగ్ను సస్పెండ్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు నిందితులను అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరోవైపు అత్యాచార బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్లో స్పందించారు. సాధారణ ప్రజలకు న్యాయం చేస్తున్నామంటున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఘటన చెంపదెబ్బని విమర్శించారు. నిందితులతోపాటు నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.