లక్నో : గృహ హింస ఫిర్యాదు ఇచ్చిన మహిళ సమస్యను పరిష్కరించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ (57) ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది. కానిస్టేబుల్ నిర్వాకంపై మహిళ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కకడ్ పోలీస్స్టేషన్లో పనిచేసే యశ్వంత్ రాధోఢ్గా గుర్తించారు. గృహ హింసకు గురిచేయడంతో పాటు కానిస్టేబుల్ లైంగిక వేధింపుల్లోనూ భర్త, అత్త ప్రమేయం ఉందని బాధితురాలు ఆరోపించారు.
తనను భర్త శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ జూన్ 19న మహిళ పోలీసులకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆమె భర్త రెండవ భార్యతో కలిసి ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాత్రి 11 గంటలకు మహిళ ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళతో ఏకాంతంగా గంటపాటు గడిపిన కానిస్టేబుల్ మాటలు, చేష్టలను ఆమె రికార్డు చేయగా అతడు అమర్యాదకరంగా మాట్లాడటం వినిపించింది. హెడ్ కానిస్టేబుల్ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.