హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శిల్పారామం ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు యువకుడిని చంపి తగులబెట్టారు. కాలిపోయిన మృతదేహాన్ని ఈ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్టీం ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య ఇక్కడే జరిగిందా.? లేదా ఎక్కడైనా చంపి తీసుకువచ్చి ఇక్కడ మృతదేహాన్ని పడేసి కాల్చేశారా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.