కోల్కతా : బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని రౌదిఘీ స్టేడియంలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బెంగాల్ను బీజేపీ నాశనం చేస్తుందన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు ఒకరితో ఒకరు కలిసి టీ తాగుతారని, దుర్గా పూజను కలిసి జరుపుకుంటారన్నారు. కానీ ‘గ్రామాల్లో అశాంతి ఉంటేనే బీజేపీకి ప్రయోజనం ఉంటుందని’ ఆరోపించారు. ‘ఎస్సీ వర్గానికి చెందిన వారు చెందిన వారు నాతో కలిసి నా ఇంట్లో తింటారు’.. బీజేపీ నేతలు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటారు’ అన్నారు.
ఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలపై సైతం విమర్శలు గుప్పించారు. హిందువులు, ముస్లింలను విభజించేందుకు బీజేపీ ఆయా పార్టీల నేతలకు డబ్బులు ముట్టజెప్పిందని ఆరోపించారు. ఎన్ఆర్సీతో పాటు ప్రజలను విభజించకూడదనుకుంటే.. వారికి ఓటు వేయొద్దని, ఆ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. రైదిఘీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నీరు తాగునీరు ఇస్తామని, ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేటు నర్సింగ్ హోంలలో ఉచిత వైద్యసేవలు ప్రారంభిస్తామన్నారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ ఈ నెల 6న జరుగనుంది.