హైదరాబాద్ : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( ఏ.పీ.పీ ) 151 పోస్టుల భర్తీ కోసం ఇటీవల జారీ చేసిన పరీక్షల నోటిఫికేషన్లో వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచాలని హైకోర్టు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన న్యాయవాదులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయవాదులు శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ను నగరంలోని మంత్రుల నివాస సముదాయంలో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు వయో పరిమితి పెంచినట్లే ఏ.పీ.పీ. అభ్యర్థులకూ పెంచాలని కోరారు. తద్వారా అనేక మంది న్యాయవాదులకు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
న్యాయవాదుల విజ్ఞప్తిపై వినోద్ కుమార్ స్పందిస్తూ.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రతినిధుల బృందంలో హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ కార్యదర్శి సి. కళ్యాణ్ రావు, లలితా రెడ్డి, శ్రావ్య, నల్లమోతు రాము, విశ్వేశ్వర రావు, చంద్రశేఖర్ రావు, అజయ్ కుమార్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.