ముంబై : కన్యత్వ పరీక్షలో విఫలం కావడంతో తమ భర్తలు తమకు విడాకులిచ్చారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కన్యత్వ పరీక్షలో ఒక మహిళ కన్య కాదని తేలడంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లను పుట్టింటికి పంపడం కలకలం రేపింది. కంజర్భట్ తెగకు చెందిన వీరికి గత ఏడాది వివాహమైంది. వీరిలో ఒక మహిళ కన్యత్వ పరీక్షలో విఫలమైందని అంటూ ఆమెను పుట్టింటికి పంపేందుకు భర్త అత్తమామలు సన్నద్ధమయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వీరి భర్తలు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అనాగరిక తీర్పు ఇచ్చిన జన పంచాయతి సభ్యులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెండ్లయిన కొద్దిరోజులకే కొత్త పెండ్లికూతురును భర్త సందీప్ అత్త శోభ నిత్యం వేధింపులకు గురిచేసేవారు. కొద్దిరోజుల తర్వాత బంధువుల సమక్షంలో కన్యత్వ పరీక్ష చేపట్టారు. గదిలో బెడ్ పైనా తెల్ల దుప్పటి వేసి, ఆపై దానికి రక్తపు మరకలు అంటకపోవడంతో కొత్త కోడలు కన్య కాదని వేధింపులకు పాల్పడ్డారు. పుట్టింటికి వెళ్లాలని రూ పది లక్షలు చెల్లించాలని నిత్యం చిత్రహింసలు పెట్టారు. తమ భర్తలు తమకు విడాకులచ్చినా అవి కోర్టులో చెల్లవని, కుల పంచాయతీలో మాత్రం తమ భర్తలు తిరిగి పెండ్లి చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారని బాధిత మహిళలు ఆరోపించారు.